చుక్కల మందే పరిష్కారం
లేకుంటే జీవితాంతం నరకమే
నేడు జిల్లా అంతటా పల్స్పోలియో
jogipet.com: పోలియో నివారణకు చుక్కల మందే సరైంది. చిన్నతనంలోనే సకాలంలో చుక్కల మందు వేయిస్తే పోలియోను నివారించినట్టే. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆ వ్యాధి దాడి చేయడం ఖాయం. నరాలను నిర్వీర్యం చేసి.. అంగవైకల్యానికి గురి చేసే పోలియో వ్యాధిపై కేంద్రం యుద్ధాన్ని ప్రకటించింది. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించి వారి సహకారంతో పోలియోను నిర్మూలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. చుక్కల మందుతో పిల్లలకు చక్కని ఆరోగ్యాన్ని అందించేందుకు ఆదివారం జిల్లావ్యాప్తంగా పోలియో చుక్కలు వేయనున్నారు. పోలియో ఎలా సోకుతుంది.
జీవితాన్ని పీల్చిపిప్పిచేసే వైరస్ :-
వైల్డ్ పోలియో వైరస్ వల్ల పోలియో వస్తుంది. ఈ వ్యాధిని శిశు పక్షవాతం అని కూడా అంటారు. ఆహారం, నీటి ద్వారా వ్యాధిజనక వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తాయి. వెంటనే ముక్కు, కంటి నుంచి నీరు కారడం, ఒళ్లునొప్పులు, జ్వరం, తలనొప్పి, జలుబు లక్షణాలు కన్పిస్తాయి. దీనిప్రభావం నాడిమండలంపై పడుతుంది. వైరస్ తాకిడికి లోనైన కండరాలు పనిచేయవు. అవయవాల కండరాల సైజు తగ్గుతుంది. వ్యాధి సంక్రమించిన పిల్లలు నేలపై పాకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆధారం లేకుండా నడవలేరు. వయస్సు పైబడినా వీరి బతుకంతా పరాధీనమే. వ్యాధి సోకిన తర్వాత ఎన్ని మందులు వాడిన నరాల పనితీరులో ఆశించిన మార్పు ఉండదని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
|
|